నేటి సాక్షి – జగిత్యాల బ్యూరో*( రాధారపు నర్సయ్య )జగిత్యాల జిల్లాలో మక్క రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి స్పందిస్తూ వెంటనే మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్కు లేఖ రాశారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ఆలస్యం కారణంగా రైతులు తక్కువ ధరలకు పంటను అమ్ముకోవాల్సి వస్తోందని, దీని వల్ల భారీ నష్టం వాటిల్లుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.*కొనుగోలు కేంద్రాల లేమితో రైతుల ఇబ్బందులు*జగిత్యాల జిల్లాలో ఈ ఏడాది విస్తృతంగా మక్క పంట సాగు చేయబడింది. అనుకూల వాతావరణ పరిస్థితుల వల్ల దిగుబడి కూడా అధికంగా వచ్చింది. అయితే పంట కోతలు పూర్తయ్యాక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో జాప్యం జరగడం రైతులకు ఇబ్బందిగా మారింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు తమ పంటను నిల్వ చేసుకునే పరిస్థితి లేక ప్రైవేట్ వ్యాపారులకు అమ్మకానికి దిగుతున్నారు.*ఎంఎస్పి ప్రకటించినా ప్రయోజనం లేకుండా పరిస్థితి*కేంద్ర ప్రభుత్వం మక్కకు కనీస మద్దతు ధర (ఎంఎస్పి)గా రూ.2400 నిర్ణయించినప్పటికీ, జిల్లాలో ఆ ధరకు కొనుగోలు జరగడం లేదు. వ్యాపారులు క్వింటాల్కు రూ.1700 నుంచి రూ.1800 మాత్రమే చెల్లిస్తున్నారని రైతులు చెబుతున్నారు. దీంతో మార్కెట్లో కనీస మద్దతు ధర అమలు కాకపోవడం రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది.*భారీ ఆర్థిక నష్టం-ఎంపీ ఆందోళన*ఈ పరిస్థితుల కారణంగా ప్రతి రైతు సగటున రూ.20,000 నుంచి రూ.25,000 వరకు నష్టపోతున్నారని ఎంపీ అరవింద్ ధర్మపురి పేర్కొన్నారు. పంట పెట్టుబడులు, ఎరువులు, కార్మిక వ్యయాలు పెరిగిన నేపథ్యంలో రైతులకు ఇది తీవ్రమైన ఆర్థిక భారం అవుతుందని ఆయన తెలిపారు.జగిత్యాల జిల్లాలో వెంటనే మక్క కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, రైతుల నుంచి కనీస మద్దతు ధరకు పంట కొనుగోలు చేయాలని ఎంపీ కలెక్టర్ను కోరారు. కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తూకం, రవాణా, చెల్లింపుల వ్యవస్థలను సమర్థంగా అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు.*అదనపు ఏర్పాట్లపై సూచనలు*మక్క కొనుగోలు కేంద్రాల వద్ద తేమ శాతం (మాయిశ్చర్) పరీక్షలు సక్రమంగా నిర్వహించాలని, రైతులకు అనవసరంగా తిరస్కరణలు ఇవ్వకుండా చూడాలని ఎంపీ సూచించారు. అలాగే గోదాములు, నిల్వ సదుపాయాలు పెంచి రైతులు పంటను భద్రపరుచుకునేలా చూడాలని చెప్పారు. రైతులకు సమీపంలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే రవాణా ఖర్చులు తగ్గుతాయని ఎంపీ అభిప్రాయపడ్డారు.________





