నేటి సాక్షి వికారాబాద్ :వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశoలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలపై వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… మాతా శిశు సంరక్షణ, గర్భవతులకు అన్ని రకాల సేవలను అందిస్తూ వాటి వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని, మాతృ మరణాలు జరగకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. జిల్లా పరిధిలో అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్ నిర్వహణ 62 శాతం మాత్రమే ఉందని దీనిని 100 శాతం సాధించే విధంగా వైద్యులు కృషి చేయాలని సూచించారు. టి.బి వ్యాధిగ్రస్తుల స్క్రీనింగ్ పరీక్షలు నిర్ధారణ అయిన వారందరికీ చికిత్స అందిస్తూ వారి వివరాలు ఎప్పటికప్పుడు నిశ్చయ్ ఆన్లైన్ పోర్టల్ లో నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు. జిల్లా పరిధిలో 14 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసు ఉన్న అమ్మాయిలకు సర్వైకల్ క్యాన్సర్ రాకుండా నిరోధించడం కోసం ప్రత్యేక డ్రైవ్ ద్వారా హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నప్పటికీ నిర్దేశిత లక్ష్యం మేరకు వ్యాక్సినేషన్ కార్యక్రమం జరగకపోవడం వలన జిల్లా విద్యాశాఖ అధికారి మరియు సాంఘిక సంక్షేమ శాఖ రీజినల్ కోఆర్డినేటర్లతో సమన్వయం చేసుకొని వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శిశు మరణాల నియంత్రణకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న సంకల్ప్ కార్యక్రమ అమలుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, ఆసుపత్రుల సూపరిండెంట్లు డిసి హెచ్ఎస్ సమన్వయ సమావేశం నిర్వహించుకోవాలని ఆయన తెలిపారు.జిల్లాలోని 23 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూడా జాతీయ నాణ్యతా ప్రమాణాల నిబంధనలు తప్పకుండా పాటించాలని అందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం అవసరమైతే అంచనాలు రూపొందించినట్లయితే నిధులు మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. ఇకనుండి జిల్లా పరిధిలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ప్రతి వారం ప్రగతి నివేదికలు తీసుకొని సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ డి. స్వర్ణ కుమారి జిల్లా పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అందజేస్తున్న వివిధ రకాల సేవల ను,సాధించిన ప్రగతి లక్ష్యాలను జిల్లా కలెక్టర్ కు వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ సుధీర్ , ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ రాజ్యలక్ష్మి, కొడంగల్ ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ మాలతి, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ పవిత్ర, డాక్టర్ వరలక్ష్మి, డాక్టర్ పద్మ, డిప్యూటీ డిఎంహెచ్ఓ లు డాక్టర్ రవీంద్ర యాదవ్, డాక్టర్ జ్యోతి, వైద్యులు పాల్గొన్నారు.





