నేటి సాక్షి పాములపాడు (మే-04 ):- పాములపాడు మండలంలోని, పెంచికలపల్లి గ్రామంలో నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆత్మకూరు డిఎస్పి- ఆర్.రామంజి నాయక్ సూచనలతో సబ్ ఇన్స్పెక్టర్- పి.తిరుపాలు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందితో కలిసి ఆపరేషన్ వజ్రపహార్ కార్యక్రమంలో భాగంగా నేటి తెల్లవారుజామున నేర నియంత్రణ మరియు శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం సిఎఎస్ఓ (కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్) ఆపరేషన్లు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పెంచికలపల్లి గ్రామంలో రౌడీ షీటర్లు మరియు అనుమానితులు, నేర చరిత్ర గల వారి నివాసాలలో తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ సోదాలలో అక్రమ మద్యం స్వాధీనం చేసుకోవడంతో పాటు సరైన ధ్రువపత్రాలు లేని మోటర్ సైకిళ్లకు జరిమాన విధించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ- పి.తిరుపాలు గ్రామ ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక మరియు చట్టపరమైన దుష్పరిణామాల గురించి అవగాహన కల్పించారు. గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, కుటుంబ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు.ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే ఏపీ ఈఏజిఎల్ఈ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చే వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు.అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా పోలీసు అధికారులు, సిబ్బంది మరియు ప్రజలతో కలిసి “ఆపరేషన్ వజ్రప్రహార్ ప్రతిజ్ఞ” నిర్వహించి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రతిజ్ఞ చేశారు.ప్రజల భద్రత కోసం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు ఈ ఆపరేషన్లు చేపట్టడం జరిగిందన్నారు.అనంతరం సమాజంలో జరుగుతున్న నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా సైబర్ క్రైమ్, రోడ్డు ప్రమాదాలు, మహిళలపై, చిన్నారులపై జరిగే నేరాలు మొదలగు వాటిపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పోలీస్ అధికారులు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్లు ఏ.ఖాజా, శివ, తదితర పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.





