( నేటి సాక్షి) ప్రతినిధి.తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం (టి ఆర్ ఎస్ ఎం ఏ) రాజేంద్రనగర్ మరియు రంగారెడ్డి జిల్లా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక క్రీడల బహుమతుల ప్రధానోత్సవం 2025-26 కార్యక్రమంలో రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృత కార్యక్రమాలను తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు. క్రీడల వల్ల విద్యార్థుల్లో జట్టుకట్టే తత్వం, నాయకత్వ లక్షణాలు మరియు ఓటమిని స్వీకరించే ధైర్యం అలవడతాయని ఆయన తెలిపారు. సంస్థ విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు ఇలాంటి క్రీడా పోటీలను నిర్వహించడం అభినందనీయమని ఆయన కొనియాడారు. వివిధ క్రీడల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే గారు మెడల్స్ మరియు ప్రశంసా పత్రాలను అందజేశారు. క్రీడల్లో రాణించిన విద్యార్థులు భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జిల్లాకు, రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు, పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.





