నేటి సాక్షి మార్చి 8 (మంచిర్యాల్) (శ్రీధర్ దమ్మ) మందమర్రి అంగడి బజార్ సీఎస్పీ రోడ్డులో నివాసముంటున్న పదవ తరగతి విద్యార్థి క్యాతన అజయ్(16) ఆదివారం ఉదయం ఉరివేసుకుని బలవన్మరణం చేసుకున్నాడు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఒత్తిడి మరియు సరిగ్గా చదవలేకపోతున్నాననే ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం క్యాతన సత్యనారాయణ కుమారుడు అజయ్ స్థానిక సింగరేణి హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు.ప్రస్తుతం వార్షిక పరీక్షలు దగ్గరపడుతుండటంతో అజయ్ తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాడు. ఎంత చదివినా తనకు మార్కులు రావేమోనని, కేవలం పాస్ మార్కులు మాత్రమే వస్తాయేమోనని గత కొద్ది రోజులుగా తన తల్లిదండ్రులు వద్ద ఆవేదన వ్యక్తం చేసేవాడు.రోజు మాదిరిగా ఆదివారం తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో తండ్రి సత్యనారాయణ అజయ్ ను నిద్రలేపి చదువుకోమని చెప్పి నిద్రించగా తిరిగి 06:45 గంటల సమయంలో కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చూడగా, ఇంటి ముందున్న రేకుల షెడ్డు ఉన్న ఇనుపపైపుకు నైలాన్ తాడుతో ఉరి వేసుకుని కనిపించాడు.హుటాహుటిన కిందకు దించి చూడగా అప్పటికే అజయ్ మృతి చెందాడు. సంఘటన స్థలంలో ఒక సూసైడ్ నోట్ లభ్యమైంది. అందులో “సారీ మమ్మీ, ఐ లవ్ యు డాడీ, సారీ శ్రీనిధి(చెల్లి పేరు)” అని రాసి ఉంది.చదువు విషయంలో పడుతున్న మానసిక ఆందోళన వల్లే తన కుమారుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని తండ్రి సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుని తండ్రి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్ఐ గోపతి నరేష్ తెలిపారు





