( నేటి సాక్షి)రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీ సర్వే నెంబర్ 626 /2 అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే నిబంధనలకు విరుద్ధంగా అక్రమ వెంచర్ల నిర్మాణం చేపడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వ భూమిపై కన్ను పడింది నిబంధనలు గాలికి వదిలేసి పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం 111 జీవోను అమలు చేస్తున్నప్పటికీ, ఇక్కడ ఆ నిబంధనల ఊసే కనిపించడం లేదు. ఎటువంటి అనుమతులు లేకుండానే వెంచర్లు వేస్తూ ప్లాట్ల విక్రయాలకు తెరలేపారు. గతంలో వివాదాస్పదంగా మారిన ఇదే స్థలంలో మళ్లీ నిర్మాణాలు మొదలవ్వడం వెనుక అధికారుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకున్నారు అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు.జీహెచ్ఎంసీ కార్యాలయం పక్కనే ఈ తతంగం జరుగుతున్నా, క్షేత్రస్థాయి అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వెనుక మతలబు ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రెవెన్యూ పురపాలక శాఖాధికారుల కళ్లుగప్పి ఇంత పెద్ద వెంచర్ నిర్మాణం జరగడం అసాధ్యమని, ఇది స్పష్టంగా లోపాయికారీ ఒప్పందమేనని స్థానికులు వాపోతున్నారు.తక్షణ చర్యలు తీసుకోవాలి:ప్రభుత్వ భూమిని రక్షించాల్సిన బాధ్యత ఉన్న అధికారులు తక్షణమే స్పందించి, ఈ అక్రమ వెంచర్పై కఠిన చర్యలు తీసుకోవాలని, దీని వెనుక ఉన్న సూత్రధారులను శిక్షించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని స్థానిక ప్రజలు హెచ్చరిస్తున్నారు.





