నేటి సాక్షి కొమురం భీమాసిఫాబాద్ ప్రతినిధి మార్చి 09 నిరుపేదల సంక్షేమంలో భాగంగా రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. సోమవారం జిల్లాలోని కాగజ్ నగర్ మండలం బారిగాం గ్రామంలో నిర్మిస్తున్న రెండు పడక గదల ఇండ్ల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెండు పడకగదుల నిర్మాణ పనులు, మౌలిక వసతుల కల్పన త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. నిర్మాణంలో ఉన్న ఇండ్లను త్వరగా పూర్తి చేసి ప్రారంభించేందుకు సిద్ధం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పూర్తి అయిన ఇండ్లలో విద్యుత్ సౌకర్యం, చిన్న పనులు, వీధి దీపాలు, త్రాగునీరు, మురుగు కాలువలు, అంతర్గత రహదారుల పనులను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. మొత్తం మంజూరైన 480 ఇండ్లకు 192 ఇండ్లు బేస్మెంట్ దశలో ఉండటానికి గల కారణాలను గృహ నిర్మాణ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిగిలిన 288 ఇండ్లు తుది దశలో ఉన్నందున పనులు పూర్తి చేసి ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని తెలిపారు. అనంతరం కాగజ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించి 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ వార్షిక పరీక్షలకు సన్నద్ధం అవడంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి లేకుండా వార్షిక పరీక్షలను ప్రశాంత వాతావరణంలో సిద్ధం చేయాలని తెలిపారు. ఉపాధ్యాయులు సబ్జెక్టులపై విద్యార్థులకు గల అనుమానాలను నివృత్తి చేస్తూ పరీక్షలు అంటే భయం లేకుండా చేయాలని తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వంటశాల, తరగతి గదులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులకు సులభంగా జీర్ణమయ్యే ఆహారం అందించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ పి.డి. ప్రకాష్ రావు, తహసిల్దార్ మధుకర్, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, గృహ నిర్మాణ శాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు





