నేటిసాక్షి, మిర్యాలగూడ : పవిత్ర రంజాన్ మాసంలో పలు ముస్లిం కుటుంబాలకు నల్లగొండ జిల్లా ప్రఖ్యాత సోషల్ సర్వీస్ ఆర్గనైజర్, హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హమీద్ షేక్ రంజాన్ కిట్లు పంపిణీ చేశారు. రంజాన్ కిట్ల పంపిణీ కోసం సహకారం అందిస్తున్న దాతలకు, మిత్ర బృందానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత ఆరేండ్ల నుంచి ప్రతీ ఏడాది ముస్లిం కుటుంబాలకు చేయూత అందిస్తూ సర్వమత సౌభ్రాతృత్వాన్ని ప్రతీకగా నిలుస్తున్న మిత్ర బృందం తనకు ఉన్నందుకు గర్వంగా ఉన్నదన్నారు. యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పవిత్ర రంజాన్ మాసంలో దాన ధర్మాలు నిర్వహించాలని మిత్ర బృందాన్ని అభ్యర్ధించినట్టు తెలిపారు. ముస్లిం సోదరసోదరీమణులు ఐక్యతగా మెలగాలని కోరారు. రంజాన్ పండుగను ఇంటిల్లిపాది భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని హమీద్ షేక్ సూచించారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలకు శక్తివంచన లేకుండా సాయం అందించేందుకు దాతలు, స్వచ్చంద సంస్థలు, ఎన్నారైలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇమ్రాన్, అహ్మద్, నబీ, తదితరులు పాల్గొన్నారు.





