నేటిసాక్షి, మిర్యాలగూడ రానున్న రోజుల్లో మిర్యాలగూడ ప్రాంతాన్ని ఒక ప్రధాన పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోమంగళవారం ప్రభుత్వ విప్ వేముల వీరేశం, స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, డిసిసి అధ్యక్షుడు పున్న కైలాస నేత లతో కలసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం ఉమ్మడి నల్గొండ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి సస్యశ్యామలం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మిర్యాలగూడను రానున్న రోజుల్లో ఒక ప్రధాన పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దుతామని, భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో భాగంగా హైస్పీడ్ ట్రైన్లు, నేషనల్ హైవేలు, డ్రై పోర్ట్, మరియు గ్రీన్ ఫీల్డ్ హైవేల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి తెలిపారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో రూ. 500 కోట్లతో ట్రైన్ హబ్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన డీపీఆర్ ఈ ఏడాది నవంబర్ నాటికి పూర్తవుతుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలు కేవలం రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధి నిధుల కోసమేనని అన్నారు. నేషనల్ హైవేపై నిర్మించాల్సిన ఫ్లైఓవర్ పనుల గురించి ఇప్పటికే కాంట్రాక్టర్లతో చర్చలు జరిపామని, త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. హైవేపై ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, తక్షణమే రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా అధికారికంగా లేఖ రాశామని, జాతీయ రహదారి పై ఫ్లై ఓవర్ల నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ నేతలుహరీష్ రావు, కేటీఆర్ పనిలేక ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలా బలంగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో కూడా జిల్లాలోని 12 స్థానాలను క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని అన్నారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.





