నేటి సాక్షి గజ్వేల్ :—-దివంగత నాయకుడు నల్లా శ్రీధర్ రావు 54వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మరియు వారి సహాయకులకు అల్పాహారాన్ని పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమం ద్వారా నల్లా శ్రీధర్ రావు సేవాభావాన్ని గుర్తుచేసుకుంటూ ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ నాయిని సత్యలక్ష్మి యాదగిరి, నల్లా భానుప్రియ మాట్లాడుతూ నల్లా శ్రీధర్ రావు చిన్నతనం నుంచే రాజకీయాల్లో చురుకుగా పాల్గొని తనదైన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారని తెలిపారు. గతంలో టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్కు వీరాభిమానిగా ఉన్న నల్లా శ్రీధర్ రావు పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు కోసం ప్రత్యేకంగా కృషి చేశారని గుర్తు చేశారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన నల్లా శ్రీధర్ రావు పార్టీ అభివృద్ధి కోసం క్రియాశీలకంగా పని చేస్తూ ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడూ ముందుండే ఆయన వ్యక్తిత్వం అందరికీ ఆదర్శంగా నిలిచిందన్నారు.రాజకీయంగా ఎదుగుతున్న కీలక సమయంలోనే నల్లా శ్రీధర్ రావు అకాల మరణం చెందడం పట్ల అభిమానులు తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తున్నారని, ఆయన మృతిని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపారు.నల్లా శ్రీధర్రావు పై ఉన్న అపారమైన అభిమానంతో ప్రతి సంవత్సరం ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అభిమానులు ఘనంగా నిర్వహిస్తూ పలు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అల్పాహార పంపిణీతో పాటు పలు సేవా కార్యక్రమాలను కూడా చేపట్టినట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో నల్లా శ్రీధర్ రావు కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పరుచూరి రాజు, ఆర్కే శ్రీనివాస్, సాయి, నాయిని తిరుపతి,కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులు అర్పించారు.





