నేటి సాక్షి వికారాబాద్ :వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని పరేడ్ మైదానంలో శనివారం నిర్వహించిన జనరల్ పరేడ్లో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) శ్రీమతి స్నేహ మెహ్రా, ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించి, పరేడ్ ను అత్యంత నిశితంగా పరిశీలించారు. అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తూ.. నిరంతరం విధి నిర్వహణలో ఒత్తిడికి లోనయ్యే పోలీస్ సిబ్బందికి పరేడ్ అనేది కేవలం ఒక కసరత్తు మాత్రమే కాదని, అది శారీరక దృఢత్వానికి మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రతి వారం క్రమం తప్పకుండా పరేడ్లో పాల్గొనడం వల్ల వృత్తిపరమైన క్రమశిక్షణ అలవడుతుందని, ఇది విధి నిర్వహణలో మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు తోడ్పడుతుందని ఆమె వివరించారు.అదేవిధంగా, ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని, యోగా, వ్యాయామం, సమతుల ఆహారం వంటి అంశాలను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. శారీరకంగా దృఢంగా, మానసికంగా ఉల్లాసంగా ఉన్న పోలీస్ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించగలరని ఆమె తెలిపారు.పరేడ్ అనంతరం ఎస్పీ సిబ్బందితో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది ఎదుర్కొంటున్న వ్యక్తిగత వృత్తిపరమైన ఇబ్బందుల గురించి ఆరా తీశారు. సిబ్బంది సంక్షేమమే తమ ప్రాధాన్యత అని పేర్కొంటూ, పోలీస్ అధికారులందరూ సిబ్బందికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని భరోసా ఇచ్చారు. ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బి.రాములు నాయక్, ఏఆర్ డిఎస్పి వీరేష్ , ఆర్.ఐలు నాగరాజు,శ్రీశైలం లు మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.





