నేటి సాక్షి, నారాయణపేట, మే 7 (రిపోర్టర్ ఇమామ్ సాబ్ ),తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి పాలన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా, గురువారం మరికల్ రైతు వేదికలో “రైతు వరోత్సవాలు” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మరియు విద్యుత్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించి, రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ ఆయిల్ పామ్ సాగు, నానో యూరియా వినియోగం, ప్రకృతి వ్యవసాయం పై వ్యవసాయ శాఖ ద్వారా అవగాహన కల్పించారు. అదేవిధంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రైతులకు *పీఎం కుసుమ్ పథకం గురించి వివరించి, సోలార్ పంప్ సెట్ల వినియోగం మరియు ప్రభుత్వ సబ్సిడీలపై సమాచారం అందించారు.కార్యక్రమంలో ఆధునిక వ్యవసాయ సాంకేతికతలో భాగంగా డ్రోన్ టెక్నాలజీపై ప్రత్యక్ష ప్రదర్శన నిర్వహించి, డ్రోన్ ద్వారా పంటలపై మందుల పిచికారీ చేసే విధానం, తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో సమర్థవంతంగా పిచికారీ చేయగల ప్రయోజనాలను రైతులకు వివరించారు.ఈ కార్యక్రమంలో మరికల్ మండల వ్యవసాయ అధికారి, మరికల్ విద్యుత్ శాఖ ఏఈ, వ్యవసాయ విస్తరణ అధికారులు పశువైద్య అధికారి, మరికల్ సర్పంచ్, మండల స్థాయి ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.రైతులు ఆధునిక సాంకేతికతను వినియోగించి ఖర్చులు తగ్గించుకొని అధిక దిగుబడులు సాధించాలని అధికారులు సూచించారు.





