నేటి సాక్షి,మునగాలరైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించి అధిక దిగుబడులు సాధించాలని శాస్త్రవేత్తలు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మునగాల మండలం తిమ్మారెడ్డిగూడెం గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU), తెలంగాణ వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వ్యవసాయ కీటక శాస్త్రవేత్త శ్రీమతి ఎ. రాములమ్మ మాట్లాడుతూ. వానాకాలం సీజన్కు ముందుగానే రైతులు సరైన విత్తన రకాల ఎంపికపై దృష్టి పెట్టాలని సూచించారు. రసాయన ఎరువులు, ముఖ్యంగా యూరియాను అధికంగా వినియోగించడం వల్ల నేల సారం తగ్గిపోతుందని, దీని ప్రభావం భవిష్యత్ పంటలపై పడుతుందని తెలిపారు. సేంద్రియ వ్యవసాయం, పంట మార్పిడి విధానం, నూతన వరి వంగడాలు, రసాయన పిచికారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు వివరించారు.మండల వ్యవసాయ అధికారి బి. రాజు మాట్లాడుతూ. కొయ్యకాలును కాల్చకుండా భూమి సారాన్ని కాపాడాలని, నీటిని పొదుపుగా వినియోగించాలని సూచించారు. నానో యూరియా, నానో DAP వినియోగంతో తక్కువ ఖర్చుతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు.కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ఎ. మహిత, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు డా. టీ. హరిత, డా. బి. మమత, డా. ఇ. భాస్కర్, గ్రామ ఉపసర్పంచ్ వై. రష్మిత, ఆదర్శ రైతులు జీ. వీరారెడ్డి, ఎమ్. శ్రీనివాస్ రెడ్డి, చి. రాధాకృష్ణ పాల్గొన్నారు.సుమారు 82 మంది రైతులు, అందులో 68 మంది పురుషులు, 14 మంది మహిళా రైతులు పాల్గొని శాస్త్రవేత్తలతో ముఖాముఖి చర్చలు నిర్వహించారు.





