- – నిరాడంబర జీవితానికి నిలువెత్తు నిదర్శనం
- – పీవీని విస్మరించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు
- – కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్
నేటి సాక్షి, హైదరాబాద్: నిరాడంబర జీవితానికి, రాజనీతికి నిలువెత్తు నిదర్శనం ర్గీయ పీవీ నరసింహారావు అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ కొనియాడారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగు తేజం, గొప్ప రాజనీతిజ్ఞడు, భారతరత్న, ప్రధానమంత్రి పదవిని చేపట్టిన ఏకైక తెలుగు వాడైన మన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆ మహానుభావుడికి నివాళి అర్పిస్తున్నానని చెప్పారు. ఆ మహానుభావుడు దేశానికి చేసిన సేవల గురించి ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పీవీ నర్సింహారావు రాజకీయవేత్త మాత్రమే కాదని, బహుభాషావేత్త, కవి, రచయిత, జర్నలిస్టు, అనువాదకుడిగా అపార జ్ఞానం సంపాదించిన మహోన్నతుడు అని కొనియాడారు. తన భూములను పేదలకు పంచి ఉమ్మడి రాష్ట్రంలో భూ సంస్కరణలకు బీజం వేసిన భూదాత అని పేర్కొన్నారు. దేశం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ప్రధానిగా చేపట్టిన సంస్కరణలు దేశ ప్రగతికి పునాదిగా నిలిచాయన్నారు. పీవీ సేవలను కాంగ్రెస్, బీఆర్ఎస్ విస్మరించాయని మండిపడ్డారు. ఆయన చనిపోతే ఢిల్లీలో అంత్యక్రియలు జరగనీయకుండా అవమానించిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. ఎన్నికలప్పుడు మాత్రమే పీవీ పేరును వాడుకుని, ఆ తరువాత ఆయనను పూర్తిగా విస్మరించిన పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. పీవీ జన్మించిన వంగరలో పీవీ జ్ఞాన వేదికను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన నాలుగేళ్లయినా, నేటికీ వాటిని పూర్తి చేయకపోవడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడా ఆ పనులు పూర్తి చేయకపోవడం శోచనీయమన్నారు. ఇకనైనా వాటిని సత్వరమే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.





