నేటి సాక్షి, ఎండపల్లి:* మండలంలోని చర్లపల్లి గ్రామ అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్వాడా కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఐసిడిఎస్, అంగన్వాడి ఉపాధ్యాయురాలు కడారి పద్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారులకు అన్నప్రాసన నిర్వహించారు. ఇందులో భాగంగా చిన్నారుల తల్లిదండ్రులకు సమతుల్య ఆహారం, పోషకాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పడిదం లావణ్య మాట్లాడుతూ చిన్నారుల శారీరక, మానసిక అభివృద్ధికి సరైన పోషకాహారం ఎంతో కీలకమని తెలిపారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వం చేపట్టిన పోషణ పక్వాడా కార్యక్రమం ప్రతి కుటుంబానికి ఉపయోగకరమని, గ్రామస్థులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే చిన్నారులకు సమయానికి టీకాలు వేయించడం, శుభ్రత పాటించడం, పౌష్టికాహారం తీసుకోవడం వంటి అంశాలపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అల్గం తిరుపతి, ఐసిడిఎస్ సూపర్వైజర్ ఆండాలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యం, ఆశా వర్కర్లు పడిదం లత, జంజుపెల్లి రజిత, మహిళలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.





