నేటి సాక్షి వికారాబాద్ :ప్రజల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి వారికి భరోసా కల్పించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో “ప్రజావాణి” కార్యక్రమం నిర్వహించబడుతుంది. బాధితులు తమ సమస్యల కోసం ఎప్పుడైనా ఎస్పీ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ బాధితులకు అండగా ఉంటుందని తెలిపినారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, స్వయంగా ఫిర్యాదుదారులను కలిసి వారి ఇబ్బందులను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బాధితుల సమస్యలపై స్పందించిన ఎస్పీ, అక్కడికక్కడే సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు (S.H.O) ఫోన్ చేసి కేసుల పురోగతిపై ఆరా తీశారు. చట్ట పరిధిలో ఉన్న సమస్యలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా, పూర్తి పారదర్శకతతో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, సమాజంలో వృద్ధుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. తల్లిదండ్రులను వృద్ధాప్యంలో నిర్లక్ష్యం చేసినా లేదా వారిని మానసిక, శారీరక ఇబ్బందులకు గురిచేసినా అటువంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఇట్టి విషయం పైన పలు ఫిర్యాదులు అందినాయి అని, ప్రజావాణికి వచ్చిన ప్రతి అర్జీని కంప్యూటరైజ్ చేసి, ఆ సమస్య పరిష్కారమయ్యే వరకు నిరంతరం పర్యవేక్షించేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.





