నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పేరు మార్చడం పేదల పొట్ట కొట్టడమే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశమని సీపీఐ జిల్లా కార్యదర్శి పి మురళి సీపీఎం జిల్లా కార్యదర్శి వి నాగరాజు విమర్శించారు. సోమవారం 10 వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా తిరుపతి ఆర్డీవో కార్యాలయం ఎదుట సిపిఐ సిపిఎం ధర్నాను నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి పి మురళి వి నాగరాజు వారు మాట్లాడుతూ మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును ‘వికసిత్ భారత్-గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ (గ్రామీణ్)గా మార్చే బిల్లును కేంద్ర ప్రభుత్వం నిర్ణయించటాన్ని పూర్తిగా తప్పు పట్టారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరునే కాకుండా, దాని ఆత్మను, అమలు విధానాన్ని మార్చేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. గ్రామీణ పేదలకు ఉపాధి భరోసా కల్పించాలనే మహాత్మాగాంధీ ఆలోచనలకు విరుద్ధంగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర విధానం పేదలను, రాష్ట్రాలను శిక్షించే విధంగా ఉందని పేర్కొన్నారు. గ్రామీణ పేదలకు జీవనోపాధి భద్రత కల్పించడం, వలసలను తగ్గించడం, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధిని సాధించడం వంటి గొప్ప లక్ష్యాలతో ప్రవేశపెట్టిన ఈ చారిత్రక పథకాన్ని నిర్వీర్యం చేయాలనే దురుద్దేశంతోనే కేంద్రం ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఆరోపించారు.గతంలో వంద శాతం నిధులు వెచ్చిస్తూ పథకాన్ని అమలు చేసిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు తన వాటాను 60 శాతానికి తగ్గించి, మిగిలిన 40 శాతం భారాన్ని రాష్ట్రాలపై మోపడం అన్యాయమని పేర్కొన్నారు. ఇది రాష్ట్రాల ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపే నిర్ణయమని, కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నమేనని విమర్శించారు. పథకం పేరులో నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం ద్వారా గాంధీజీ ఆలోచనలు, విలువలపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేక వైఖరి స్పష్టంగా కనిపిస్తున్నదని ఆరోపించారు. మొదటి నుంచే ఈ పథకం నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఇష్టం లేదని, అందుకే దశలవారీగా బలహీనపరిచే కుట్రలకు తెరలేపుతున్నదని పేర్కొన్నారు.చట్టం ప్రకారం ప్రతి గ్రామీణ పేద కుటుంబానికి వంద రోజుల ఉపాధి కల్పించాల్సి ఉన్నప్పటికీ, బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏ ఏడాదిలోనూ 42 రోజుల కన్నా ఎక్కువ పని దినాలు కల్పించలేదని ఆరోపించారు.కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పూర్తి నిధులతో, బాధ్యతాయుతంగా కేంద్ర ప్రభుత్వమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య కే రాధాకృష్ణ నగర కార్యదర్శి జె విశ్వనాథ్, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు జయ చంద్ర ,వేణు , సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు ఎన్ డి రవి కె పద్మనాభరెడ్డి కే వై రాజా ఎన్ శివ వివిధ ప్రజా సంఘాల నాయకులు ఎం రామకృష్ణ, అల్లబక్షు, అలివేలు లక్ష్మీ, సాయి లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.





