నేటి సాక్షి వికారాబాద్ :మహిళా పోలీస్ స్టేషన్ ఆధునీకరణ సిబ్బంది సౌకర్యార్థం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా, జిల్లా ఎస్పీ మహిళా పోలీస్ స్టేషన్ పరిధిలో నూతన బోర్ వెల్ పనులను లాంఛనంగా ప్రారంభించారు. తెలంగాణ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ నుండి భవన మరమ్మతులు నిర్వహణ నిమిత్తం మంజూరైన నిధులతో ఈ పనులను చేపట్టినట్లు ఎస్పీ ఈ సందర్భంగా వెల్లడించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, హౌసింగ్ కార్పొరేషన్ నుండి విడుదలైన నిధులను సద్వినియోగం చేసుకుంటూ ఉమెన్ పోలీస్ స్టేషన్ ను మరింతగా అభివృద్ధి చేయాలని, మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని స్టేషన్ ఇన్స్పెక్టర్ బి. సరోజా ను ఆదేశించారు.అనంతరం ఎస్పీ ఉమెన్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేయడం జరిగింది.పోలీస్ స్టేషన్ లోని పెండింగ్ ఫైల్స్,రికార్డ్స్ లను, స్టేషన్లోని రిసెప్షన్ కేంద్రం, బ్యారక్స్, రైటర్ రూమ్లను స్వయంగా పరిశీలించిన ఎస్పీ,సలహాలు, సూచనలు చేయడం జరిగింది. కేసుల దర్యాప్తుపై ప్రత్యేక దృష్టి సారించిన ఎస్పీ, ప్రస్తుతం పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని, కేసుల పరిష్కారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం వహించకూడదని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఉమెన్ పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల అత్యంత సున్నితంగా మరియు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. “మహిళా భద్రత మా ప్రథమ ప్రాధాన్యత. ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహించకుండా, ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ విధులను నిర్వహించాలి” అని ఎస్పీ సిబ్బందికి సూచించారు. పోలీస్ స్టేషన్ వాతావరణం ఫిర్యాదుదారులకు భరోసా కల్పించేలా ఉండాలని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బి.సరోజా, ఎస్ఐ లు అనిత, స్రవంతి, శ్వేత, రాణి లు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





