నేటి సాక్షి, కొమరం భీం ఆసిఫాబాద్:గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఘన విజయం సాధించిన నేపథ్యంలో, తిర్యాని మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ విజయ సంకల్ప ర్యాలీ నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులతో కలిసి పార్టీ శ్రేణులు మండల కేంద్రంలోని కొమరం భీమ్ విగ్రహానికి పూలమాల వేసి విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు.అనంతరం రేణుక ఎల్లమ్మ దేవాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాదరావు, జిల్లా నాయకులు జువ్వాజీ అనిల్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొని గెలిచిన ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 30 ఏళ్ల రాజకీయ ఏకఛత్రాధిపత్యానికి ముగింపు పలుకుతూ జుమ్మిడి కిష్టయ్య వంటి అభ్యర్థులను గెలిపించి ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో యువత అధిక సంఖ్యలో విజయం సాధించడం శుభపరిణామమని, వారు గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలని కోరారు. మండలంలోని ప్రధాన రహదారి మరమ్మతుల కోసం రూ.3 కోట్ల నిధులు మంజూరయ్యాయని, గుండాల గ్రామంలో త్వరలోనే కొత్త పంచాయతీ భవన నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. త్వరలో జిల్లా ఇంచార్జ్ మంత్రి ఆసిఫాబాద్ పర్యటనకు రానున్నారని, మండల సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు.గ్రామాల్లోని సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి సమగ్ర నివేదికలు అందజేయాలని సర్పంచులను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మారుమూల గ్రామాల అభివృద్ధి సాధ్యమని వారు ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు చిత్తారి సాగర్, ఆత్రం సక్కు యూత్ ఫోర్స్ అధ్యక్షుడు ఆత్రం వినోద్ కుమార్, పెరుమండ్ల వెంకటేశం గౌడ్, బొల్లం శంకర్, బుద్దె విజయ్, పున్నం హరీష్ కుమార్, పడిగల అమర్, మేడిశెట్టి శంకర్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





