నేటి సాక్షి కొమురం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి జనవరి 24 చదువుతోనే ఉన్నత శిఖరాలు సాధ్యమని కాగజ్నగర్ డీఎస్పీ వహీవద్దీన్ అన్నారు. శనివారం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని స్థానిక అన్వర్ ఉర్దూ పాఠశాలలో అబిద్ అలీఖాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉర్దూ మీడియం 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా సియాసత్ క్వశ్చన్ బ్యాంక్, ఎగ్జామ్ ప్యాడ్ లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కాగజ్నగర్ డీఎస్పీ వహీవద్దీన్ ముఖ్య అతిథిగా పాల్గొని, అన్వర్ ఉర్దూ పాఠశాల, ఎగ్బాల్ స్కూల్, ప్రభుత్వ పాఠశాల, ఆర్.బి పాఠశాల లకు చెందిన ఉర్దూ మీడియం 10వ తరగతి విద్యార్థులకు క్వశ్చన్ బ్యాంక్ ఎగ్జామ్ ప్యాడ్ లను అందజేశారు.ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, ఆటపాటలతో పాటు చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించి, తమ తల్లిదండ్రుల పేరు మాత్రమే కాకుండా సిర్పూర్ నియోజకవర్గానికి రాష్ట్రస్థాయిలో మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు అన్నారు. అలాగే గతంలో 10వ తరగతి ఉర్దూ మీడియం పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు కూడా అబిద్ అలీఖాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సియాసత్ క్వశ్చన్ బ్యాంక్లు అందజేయడం అభినందనీయమని తెలిపారు. విద్యరంగ అభివృద్ధికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.మండలాధికారి ప్రభాకర్ మాట్లాడుతూ, మండలంలోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు కష్టపడి చదివి విజయాలు సాధించడం ద్వారా తమ గురువులకు, తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలవాలని అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అందిస్తున్న మార్గదర్శనం, తల్లిదండ్రుల సహకారం వల్ల మంచి ఫలితాలు సాధించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. విద్యతోనే భవిష్యత్తు నిర్మాణం సాధ్యమవుతుందని, ప్రతి విద్యార్థి లక్ష్యసాధనతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ప్రభాకర్,రూరల్ సీఐ కుమారస్వామి,అన్వర్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు ఆరిఫ్ ఉద్దీన్, ట్రస్ట్ జిల్లా ఇంచార్జ్ అబ్దుల్ జమీల్,కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయుడు తాటి రవీందర్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.





