*నేటి సాక్షి, ఎండపల్లి:* మండలంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. తహశీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో ఎడ్ల అనిల్ కుమార్, పోలీస్ స్టేషన్, రాజారాంపల్లి కూడలిలో ఎస్సై ఉదయ్ కుమార్, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో కృపాకర్, ఇతర ప్రభుత్వ కార్యాలయాల తోపాటు పలు గ్రామ పంచాయతీలలో సంబంధిత అధికారులు, ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, టీయుడబ్ల్యూజే (ఐజేయూ) ప్రెస్ క్లబ్ లో పాత్రికేయులతో కలిసి నల్లాల కుమార్, పలు రాజకీయ పార్టీల నాయకులు జాతీయ పథకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. దీనికి ముందు మహానీయుల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ స్ఫూర్తిని అందుకుని ప్రజాస్వామ్య విలువలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని గుర్తు చేసుకుంటూ దేశ ఐక్యత కోసం కుల మతాలకు అతీతంగా అందరం అంకితం అవుదామని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమాలలో గిర్ధావర్ అన్వేష్, వ్యవసాయాధికారి కమల్ల మహేష్, విద్యాధికారి సముద్రాల హరికృష్ణ, వైద్యాధికారి లవ కుమార్, పశు వైద్యాధికారి మనోజ్ కుమార్, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, నాయకులు, యువత, ప్రజలు పాల్గొన్నారు.





