నేటి సాక్షి, ఎండపల్లి:* జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో డ్రగ్స్, మత్తు పదార్థాల వినియోగం, ఆన్లైన్ మోసాలపై యువత, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇదే గ్రామానికి చెందిన సామాజిక సేవకులు మంతెన సంజీవ్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమం చైతన్యాన్ని నింపింది. ఈ సందర్భంగా సంజీవ్ తో పాటు దీనికి అతిథులుగా హాజరైన నాయకులు మాట్లాడుతూ… మత్తు పదార్థాలకు అలవాటు పడితే యువత భవిష్యత్తు అంధకారమవుతుందని అన్నారు. డ్రగ్స్ వినియోగం వ్యక్తి ఆరోగ్యానికే కాదు, కుటుంబాలు, సమాజాన్ని కూడా దెబ్బతీస్తుందని హెచ్చరించారు. యువత చదువు, ఉద్యోగం, క్రీడలు వంటి సానుకూల మార్గాలపై దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే రోజురోజుకూ పెరుగుతున్న ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. బెట్టింగ్, ఫోన్ కాల్స్, లాటరీలు, నకిలీ లింకులు, బ్యాంకు వివరాలు అడిగే సందేశాల పట్ల జాగ్రత్త వహించాలని తెలిపారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఇతరులకు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలు, ఆన్లైన్ మోసాల రకాలు, వాటి నుంచి ఎలా రక్షించుకోవాలో గ్రామస్తులకు వివరించారు. ఇందుకు సంబంధించిన అవగాహన వీడియోలు తెరపై ప్రదర్శించి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. చివరగా మత్తును మరిచి మానవత్వం చాటాలని మోసాలకు బలి కాకుండా అప్రమత్తంగా ఉండాలంటూ గ్రామస్తులకు పిలుపునిచ్చారు. సమాజానికి కుదిపేస్తున్న డ్రగ్స్, మత్తు పదార్థాల వినియోగం, రోజు రోజు పెరుగుతున్న ఆన్లైన్ మోసాల నుండి ప్రజలను రక్షించేందుకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు అత్యంత అవసరమని పేర్కొన్నారు.





