నేటి సాక్షి అనంతగిరి ఈనెల 17వ తేదీన హైదరాబాదులో జరగబోయే తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సమావేశాన్ని కార్మికులు అధిక సంఖ్యలో జయప్రదం చేయాలని అనంతగిరి మండల పంచాయతీ కార్మికుల యూనియన్ అధ్యక్షులు మట్టపల్లి వీరబాబు పేర్కొన్నారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మట్టపల్లి వీరబాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికుల వేతనాలను పంచాయతీల ద్వారానే చెల్లించాలని నిర్ణయిస్తూ మార్చి 2వ తేదీన జారీ చేసిన మెమోను తక్షణమే రద్దు చేయాలని అన్నారు.రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం గ్రామపంచాయతీ సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ప్రతినెల గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లిస్తామని ప్రకటించిన విధంగా నేరుగా కార్మికుల వ్యక్తిగత ఖాతాలలో జమ చేయాలని వారు తెలిపారు.వేతనాలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని,బకాయి వేతనాలు తక్షణమే చెల్లించాలని,ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కార్మికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఒక్క పూట పని కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మండల పరిధిలోని పంచాయతీ కార్మికులందరూ హైదరాబాదులో జరగబోయే సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు సూచించారు.





