Monday, March 16, 2026

కవులకి, కళాకారులకు ఎక్కడ గౌరవం లభిస్తుందో…అక్కడ సమాజం సుభిక్షంగా ఉంటుంది-పుల్లాభట్ల వెంకటరామ శర్మ..

నేటిసాక్షి, మిర్యాలగూడ : కవులన్నా..కళాకారుకన్నా వారి పట్ల గౌరవ మర్యాదలను ఇస్తారో, అక్కడ సమాజం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుందని, సిరి సంపదలు, శుభాలు వర్ధిల్లుతాయని, కవిత్వాన్ని, కళలను ఆదరించే సమాజం ఎప్పుడూ ఉన్నతంగానే ఉంటుందని త్యాగరాయ జిల్లా పరిషత్ గౌరవ అధ్యక్షులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు పుల్లాభట్ల వెంకటరామశర్మ అన్నారు.తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ మరియు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం మిర్యాలగూడ కళాభారతి ఆడిటోరియంలో నిర్వహిస్తున్న నందినీ అవార్డ్స్-2026 జాతీయస్థాయి పద్య నాటక సాంఘిక నాటక పోటీలు ఆదివారం ఏడవ రోజు డాక్టర్ మల్లు గౌతంరెడ్డి సిఐటియు నాయకులు, డా. పందిరి రవీందర్ కెఎన్ఎమ్ డిగ్రీ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ తో కలిసి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శ్రీకృష్ణదేవరాయల కాలంలో కవులకు కళాకారులకు పెద్దపీట వేశారని, కాబట్టే ఆనాటి కాలము సస్యశ్యామలంగా కొనసాగిందని, యువతలో పేరుకుపోయిన అవినీతి ఏరులై పారుతుందని, వాటిని నివారించ గల శక్తి ఒక్క నాటికల ద్వారానే తప్ప మరో మార్గం లేదన్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలకులోనై వారం రోజులుగా జాతీయస్థాయి పద్య..సాంఘిక నాటిక పోటీలను నిర్వహిస్తున్న కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేస్తున్నాం అన్నారు. మునుముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు జరగాలని అందుకు ప్రభుత్వం తరఫునుండి కూడా చేయూత అందించాలని, ఏ ఒక్కరో పూనుకుంటే కొనసాగే కార్యక్రమాలు కాదని, కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి, ఇట్టి కార్యక్రమాలకు పెద్దపీట వేయాలని సమాజంలో ఉన్న చెడు తొలగి, మంచి రావాలంటే ఇటువంటి ఎంతో అవసరం అన్నారు. అనంతరం టీజీవి కళాక్షేత్రం కర్నూలు వారిచే సై సై సైరా నరసింహారెడ్డి పద్య నాటకం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. తర్వాత రౌతు అప్పలనాయుడు కల్చరల్ ట్రస్ట్ గ్రామం పెద్దమేరంగి పార్వతీపురం మన్యం జిల్లా వారు నటించిన యమతీర్పు సాంఘిక నాటికను ప్రదర్శించారు. నటీనటులకు సాంకేతిక నిపుణులకు అతిధులచే శాలువాలతో సన్మానించి ప్రోత్సాహక బహుమతులను షీల్డ్ లను అందజేశారు.ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షులు తడకమళ్ళ రామచంద్రరావు, అధ్యక్షులు రామావతారం, ప్రధాన కార్యదర్శి పులి కృష్ణమూర్తి శర్మ, కోశాధికారి వెంకటలక్ష్మీనారాయణ శర్మ, సాయిలు, సత్యనారాయణ చారి, లక్ష్మయ్య, ఎల్లయ్య, సత్యనారాయణ, శ్రీనివాసరావు, రాఘవయ్య, శైలజ, సరస్వతి, నాగమణి, ఉపేందర్, బాబురావు, వీరప్రతాప్, టంగుటూరి రాజారాం తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News