నేటి సాక్షి గజ్వేల్ :—-ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు, పీఆర్సీ, డీఏల విడుదలలో జాప్యం కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు సిద్దిపేట జిల్లా ఉద్యోగుల జాయింట్ ఆక్షన్ కమిటీ చైర్మెన్ గ్యాదరి పరమేశ్వర్ ఆదేశాల మేరకు, TNGO’S గజ్వేల్ తాలూకా కార్యదర్శి రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో గజ్వేల్ తాలూకా IOC కార్యాలయంలో ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో చేపట్టిన ఈ నిరసనలో ఉద్యోగులు తమ డిమాండ్లను గట్టిగా వినిపించారు.ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. ఉద్యోగులకు రావాల్సిన 2 పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న డీఏలన్నింటినీ విడుదల చేయాలని, అలాగే ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన పెన్షన్, గ్రాట్యుటీ, ఇతర బెనిఫిట్స్ను వెంటనే మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగిస్తే ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య దూరం పెరుగుతుందని హెచ్చరించారు.అదేవిధంగా ఉద్యోగుల హెల్త్ కార్డుల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని, ఉద్యోగులకు అన్యాయం చేస్తున్న సీపీఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ఈ అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయాన్ని గుర్తు చేస్తూ.. హామీలు అమలు చేయకపోతే ఉద్యమం తప్పదని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా TNGO వైస్ ప్రెసిడెంట్ నాగభూషణం, వెంకట్, జిల్లా మహిళా విభాగం నుంచి జబినా సుల్తానా, గజ్వేల్ తాలూకా ట్రెజరర్ ప్రవీణ్, ఇతర TNGO నాయకులు పాల్గొన్నారు. అలాగే జిల్లా పెన్షనర్ల సంఘం సహాయ అధ్యక్షులు రాజేష్, గజ్వేల్ పెన్షనర్ సంఘం అధ్యక్షులు నాగేశ్వరరావు, కార్యదర్శి రామకృష్ణ రెడ్డి, ఉపాధ్యాయ సంఘాల నుంచి PRTU సత్యనారాయణ రెడ్డి, లింగం, UTF వలీ అహ్మద్, సత్యనారాయణ, TPTF శ్రీనివాస్, CPS రాష్ట్ర నాయకులు ఏ. మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.నిరసన కార్యక్రమం అనంతరం గజ్వేల్ తహసీల్దార్ను కలిసి ఉద్యోగులు వినతిపత్రం అందజేశారు.





