నేటి సాక్షి న్యూస్ ఏప్రిల్ 20 పెద్దకడుబూరు మండలంలో ఉపాధి హామీ కూలీలకు తలనొప్పిగా మారిన ఫేస్ యాప్ను వెంటనే రద్దు చేయాలని సీపీఎం మండల కార్యదర్శి తిక్కన్న డిమాండ్ చేశారు. సోమవారం మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) ప్రభావతి దేవికి పలు సమస్యలు, డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా తిక్కన్న మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకంలో ఫేస్ యాప్ అమలు కారణంగా కూలీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యలు అధికంగా ఉండటంతో పనికి హాజరైనప్పటికీ హాజరు నమోదవడం లేదని, దీనివల్ల కూలీలకు వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.అలాగే ఉపాధి పనుల్లో రాజకీయ నాయకుల జోక్యం పెరిగిందని, ఇది పారదర్శకతకు విఘాతం కలిగిస్తోందని ఆరోపించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న రెండు పూటల పని విధానాన్ని రద్దు చేసి, కూలీలకు అనుకూలంగా మార్పులు చేయాలని కోరారు.ప్రమాదవశాత్తు మరణించిన ఉపాధి కూలీల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం అందించాలనే డిమాండ్ను కూడా వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ సమస్యలపై వెంటనే చర్యలు తీసుకొని కూలీలకు న్యాయం చేయాలని సీపీఎం నాయకులు కోరారు.





