నేటి సాక్షి న్యూస్ ఏప్రిల్ 28 మండల కేంద్రమైన పెద్దకడబూరులో గ్రామ పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ డ్రైనేజీ పూడిక తొలగింపు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి రాఘవేంద్ర రెడ్డి, రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ పనులు చేపట్టారు. గ్రామంలోని ప్రధాన రహదారుల వెంట డ్రైనేజీ కాల్వలను శుభ్రపరిచి, అందులో పేరుకుపోయిన పూడికను బయటకు తీసి తరలిస్తున్నారు. ముఖ్యంగా స్థానిక బస్టాండ్ నుండి ఎస్సీ కాలనీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ పూడిక తొలగింపు పనులు పూర్తి చేశారు. అదేవిధంగా కల్లుకుంట బైపాస్ ముఖద్వారం నుండి రామలింగేశ్వర స్వామి దేవాలయం వరకు రహదారి వెంట ఉన్న కాల్వలను శుభ్రపరిచి పూడికను తొలగించారు. గత నాలుగు రోజులుగా నిరంతరంగా ఈ శానిటేషన్ పనులు కొనసాగుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వర్షాకాలం ముందస్తుగా గ్రామంలో నీరు నిల్వ ఉండకుండా, దోమల పెరుగుదల నివారించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గ్రామ ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో మీసేవ ఆంజనేయులు సొసైటీ చైర్మన్ పాల్గొని పనులను పర్యవేక్షించారు. గ్రామ ప్రజలు కూడా ఈ శుభ్రత కార్యక్రమాలకు సహకరించాలని కోరారు.





