నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )సమాజ సేవ, సాహిత్య రంగాల్లో విశేష కృషి చేసిన కోరుట్లకు చెందిన అంగన్వాడీ టీచర్ మేకల సాయీశ్వరీకి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ప్రదానం చేసే ప్రతిష్ఠాత్మక ‘ఉమెన్ లీడర్షిప్ నేషనల్ అవార్డు – 2026’ఆమెకు లభించడం స్థానికంగా గర్వకారణంగా మారింది.ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో మార్చి 15న నిర్వహించిన సౌత్ ఇండియా బహుజన రైటర్స్ 18వ జాతీయ సదస్సు వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా బహుజన సాహిత్య అకాడమీ (BSA) ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారిని సత్కరించారు. కోరుట్ల పట్టణానికి చెందిన అంగన్వాడీ టీచర్ మేకల సాయీశ్వరీకి ఉమెన్ లీడర్షిప్ నేషనల్ అవార్డును ఘనంగా ప్రదానం చేశారు. సభలో పాల్గొన్న ప్రముఖుల చప్పట్ల నడుమ ఆమె అవార్డు స్వీకరించడం విశేషంగా నిలిచింది.*తిరుపతిలో అవార్డు ప్రదానం.!*ఈ అవార్డును బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ, జాతీయ ప్రధాన కార్యదర్శి డా. యు. సుబ్రమనియన్ చేతుల మీదుగా సాయీశ్వరీకి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె సేవలను కొనియాడుతూ ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందించారు. సామాజిక బాధ్యతతో పాటు సాహిత్యంపై ఆసక్తి కలిగిన మహిళగా ఆమె చేసిన కృషిని సభలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.*బహుజనులను ప్రోత్సాహించడమే అకాడమీ లక్ష్యాలు*ఈ సందర్భంగా నల్లా రాధాకృష్ణ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ..మైనారిటీల సాహిత్యాన్ని ప్రోత్సహించడం బహుజన సాహిత్య అకాడమీ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. సమాజంలో అణగారిన వర్గాల వాణిని వెలికి తీసే రచయితలు, కవులు, సంఘసేవకులు మరియు ప్రజా ఉద్యమకారులను ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం ఈ అవార్డులను ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. ఇది కేవలం గౌరవం మాత్రమే కాకుండా, సమాజ మార్పుకు ప్రేరణగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.*జాతీయ స్థాయి సదస్సు వైభవం*సౌత్ ఇండియా బహుజన రైటర్స్ 18వ జాతీయ సదస్సుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి సుమారు 600 మంది ప్రతినిధులు హాజరయ్యారు. సాహిత్యం, సామాజిక అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపి, భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో కార్యక్రమం ఘనంగా కొనసాగింది.ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ జి. విష్ణువర్ధన్, కమిటీ సభ్యులు తాటికంటి ఐలయ్య, బాదె వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. ____________





