నేటి సాక్షి - జగిత్యాల టౌన్
(పూరెళ్ల బాపు )
......................................
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి కులం, మతం, రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.
శుక్రవారం జగిత్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్ధులు, వికలాంగులు, ట్రాన్స్జెండర్ సాధికారిత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సి.సి.ఎల్.ఏ. కమిషనర్ లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతు, హౌసింగ్ ఎం.డి. గౌతమ్, వెలమ సంక్షేమ సంఘం కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడ నరసింగరావు, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తదితరులతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ముందుగా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
*మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ,*
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తోందని, సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. జగిత్యాల జిల్లాలో ఆర్డీవో కార్యాలయం, సబ్రిజిస్ట్రార్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసినట్లు చెప్పారు.గత ప్రభుత్వం నూకలపల్లి 2బీహెచ్కే కాలనీలో అవసరమైన మౌలిక వసతుల కల్పనపై నిర్లక్ష్యం చేసిందని మంత్రి అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి దశలో రూ.32 కోట్లతో తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ తదితర సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. రెండో దశలో పాఠశాల ఏర్పాటు కోసం త్వరలోనే నిధులు విడుదల చేస్తామని చెప్పారు.
నూకలపల్లి 2బీహెచ్కే కాలనీలో రేషన్ దుకాణం ఏర్పాటు చేయాలని, బస్సు సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్ను మంత్రి ఆదేశించారు. కాలనీలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2008లో పునాది వేసిన కాలనీలో 18 సంవత్సరాల తర్వాత ప్రజలకు అవసరమైన సౌకర్యాలతో ఇళ్లు అందించగలిగామని చెప్పారు.కులం, మతం, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం మరోసారి పత్రికా ప్రకటన ఇచ్చి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, క్షేత్రస్థాయిలో విచారణ అనంతరం అర్హులైన ప్రతి కుటుంబానికి ఇల్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన పేదలకు ఇళ్లు అందించేందుకు ఎలాంటి ఆందోళనలు, పోరాటాలు అవసరం లేదని, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేస్తుందని తెలిపారు.
*భూ రీ సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం*
భూ రీ సర్వే ద్వారా రాష్ట్రంలోని అన్ని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఏడాదిన్నరలోపు వ్యవసాయ భూములతో పాటు ఆబాది ఆస్తుల రీ సర్వేను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో తొలి దశలో ప్రతి జిల్లాలో 70 గ్రామాలను ఎంపిక చేసి భూ రీ సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. జగిత్యాల జిల్లాలో కూడా ఎంపిక చేసిన గ్రామాల్లో రీ సర్వే కొనసాగుతోందన్నారు. రీ సర్వే అనంతరం అర్హులైన రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నకిలీ పాస్ పుస్తకాలను గుర్తించి రద్దు చేస్తామని తెలిపారు.గత ప్రభుత్వ హయాంలో రైతుబంధు ప్రయోజనాలు పొందేందుకు అర్హత లేని వారికి, నకిలీ పాస్ పుస్తకాల ఆధారంగా ప్రయోజనాలు అందిన పరిస్థితులు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. భూ రీ సర్వే అనంతరం నిజమైన రైతుల హక్కులను పరిరక్షిస్తూ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు.
*మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ,*
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూకలపల్లి 2బీహెచ్కే కాలనీలో పెండింగ్ పనులు పూర్తి చేసి మౌలిక వసతులు కల్పించేందుకు రూ.72 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. తాగునీరు, డ్రైనేజీ తదితర మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో పాత, ప్రస్తుతం వినియోగంలో లేని ట్రాక్టర్ ఉన్న కారణంగా కొందరు అర్హులు నష్టపోతున్నారని తెలిపారు. అలాంటి అర్హులైన కుటుంబాలకు నిబంధనల్లో సడలింపు కల్పించాలని రెవెన్యూ మంత్రిని కోరారు.
ధర్మపురి ప్రజల చిరకాల కోరిక అయిన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని, ధర్మపురిలో సబ్రిజిస్ట్రార్ కార్యాలయం మంజూరు చేయాలని మంత్రి పొంగులేటిని కోరారు. మాల్యాల మండలంలో చెరువులో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందిన ఇద్దరు చిన్నారుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నట్లు తెలిపారు.
*జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ,*
నూకలపల్లి 2బీహెచ్కే కాలనీలో తాగునీరు, విద్యుత్ సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం రూ.18 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. కాలనీలో ప్రాథమిక పాఠశాల, ఆరోగ్య ఉపకేంద్రం, అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.కాలనీలో రహదారులు, చర్చ్, ఆలయం, మసీదు, రేషన్ దుకాణం తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. నూకలపల్లి కాలనీని మున్సిపాలిటీలో విలీనం చేయడానికి చర్యలు తీసుకుంటున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ నగర్, నూకలపల్లిని జగిత్యాల పట్టణంలో విలీనం చేయాలని కోరారు.జిల్లాలోని సుమారు 100 మంది సీనియర్ జర్నలిస్టుల కోసం జర్నలిస్టు కాలనీ ఏర్పాటు చేయాలని, భీంపూర్ నూతన మండలానికి తహసీల్దార్ కార్యాలయం మంజూరు చేయాలని, రాయికల్ మున్సిపాలిటీకి సబ్రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేయాలని, జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని మంత్రిని కోరారు.
*ఎమ్మెల్సీ ఎల్. రమణ మాట్లాడుతూ*
పేదలకు గౌరవప్రదమైన ఇళ్లు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నూకలపల్లి 2బీహెచ్కే కాలనీలో 4,500 ఇళ్లు నిర్మించబడ్డాయని, అయితే ప్రస్తుతం సుమారు 50 శాతం ఇళ్లలో మాత్రమే ప్రజలు నివసిస్తున్నారని తెలిపారు.
కాలనీలో మిగిలిన ఇళ్లలో కూడా ప్రజలు నివసించేలా రవాణా, సెల్ఫోన్ టవర్లు తదితర అవసరమైన మౌలిక వసతులను త్వరితగతిన కల్పించాలని కోరారు. 4,500 ఇళ్లతో నూకలపల్లి ఒక చిన్న టౌన్షిప్గా అభివృద్ధి చెందే అవకాశం ఉందని, అందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. బ్లాక్ల వారీగా ఇళ్లకు నంబర్లు కేటాయించాలని సూచించారు.
*జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ*
జగిత్యాల జిల్లాలో మొత్తం 10,365 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, 2,208 ఇళ్లు నిర్మాణం పూర్తయ్యే దశలో ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకు 8,079 మంది లబ్ధిదారులకు రూ.227 కోట్ల 32 లక్షలు విడుదల చేసినట్లు వెల్లడించారు.పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4,710 ఇళ్లు పూర్తయ్యాయని, 4,386 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని, మరో 324 మంది లబ్ధిదారుల ఎంపిక చేయాల్సి ఉందని తెలిపారు. జిల్లాలో మొత్తం 1,562 గుడిసెలను గుర్తించగా, 1,319 గుడిసెలను పరిశీలించి ధ్రువీకరించినట్లు కలెక్టర్ వివరించారు.
*చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ*
అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పేదల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు.
*వెలమ సంక్షేమ సంఘం కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడ నరసింగరావు మాట్లాడుతూ*
పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను స్వాగతించారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
*ఇద్దరు చిన్నారుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం*
కార్యక్రమం ముగింపులో చెరువులో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందిన ఇద్దరు చిన్నారుల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేశారు. అనంతరం 12 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి పట్టాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వం పల్లి సత్యనారాయణ, అదనపు కలెక్టర్లు రాజ గౌడ్, జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంఘనభట్ల దినేష్, జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల ఆర్డీవోలు మధుసూదన్, నరసింహారావు, జీవాకర్ రెడ్డి, జగిత్యాల మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి, ధర్మపురి మున్సిపల్ చైర్మన్ నాగజ్యోతి, మెట్పల్లి మున్సిపల్ చైర్మన్, కోరుట్ల మున్సిపల్ చైర్మన్, రాయికల్ మున్సిపల్ చైర్మన్, ఆయా మండలాల ప్రజా ప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు, సంబంధిత అధికారులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
Telangana
*అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు :: జగిత్యాలలో రెవెన్యూ, గృహ నిర్మాణం, ఐ&పీఆర్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి* --------------------------------------
Quick Summary:
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి